కరోనా తీవ్రతతో లాక్ డౌన్ వల్ల ప్రజలు ఎవరూ బయటకి రావడంలేదు కానీ అటవీ వన్యప్రాణులు మాత్రం స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో అలాగే జనావాసాలు తక్కువగా ఉన్న చోట బాగా సంచరిస్తున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో రోడ్లమీద ఎక్కువ రాకపోకలు లేకపోవడమే దీనికి కారణమని అంటున్నారు అటవీ శాఖా అధికారులు.
ఇదిలా ఉండగా కొట్టగణహల్లి అనే గ్రామానికి చెందిన 68 ఏళ్ల గంగమ్మ నేటి ఉదయం వాకింగ్ కు వెళ్లింది. ఆ సమయంలో ఆమెపై ఒక చిరుత దాడి చేసింది దీంతో ఆవిడ గట్టిగా అరుస్తూ ఉన్న చోటే తన ప్రాణాలు వదిలేసింది. ఆ కేకలకు విని అక్కడికి చేరుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మరియు అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిసర ప్రాంతాలను గాలించారు. తర్వాత ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం అక్కడినుండి నీలమంగళ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ చుట్టుపక్కల ఎంత గాలించినా అటవీశాఖ అధికారులకి చిరుత ఆచూకీ దొరకలేదు.
ఈ సంఘటనతో అక్కడి గ్రమస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రస్తుతం భయంతో వణికిపోతున్నారు. ఇక ఇటువంటి ఘటనే కదిరైహన పాల్యలో మూడేళ్ల చిన్న పిల్లవాడైన హేమంత్పై కూడా చిరుత దాడి చేసింది. దీంతో హేమంత్ మృతి చెందాడు. ఈ ఘటన మే నెల 9న చోటు చేసుకుంది.
ప్రస్తుతం బెంగళూరు సమీపాల్లో చిరుత కొద్ది రోజుల నుంచి సంచరిస్తున్నట్లు అక్కడి స్థానికులు తెలియజేసారు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన మరువకముందే కొత్తగా ఇంకో 68 ఏళ్ల మహిళను చిరుత దాడిచేసి చంపేసింది.
అయితే హేమంత్ను చంపేసిన చిరుతను పట్టుకుని అక్కడినుండి అడవిలో వదిలేశామని అధికారులు తెలియజేసారు.అడవిలోంచి మళ్లీ అదే చిరుత జనవాసాల్లోకి వచ్చి ఉండొచ్చని అటవీశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.