కరోనా ఎఫెక్ట్ లాక్ డౌన్ నేపథ్యంలో ఎక్కడివక్కడే బంద్ అయిపోయాయి. ఇక దేవాలయాలు సైతం మూతబడ్డాయి కానీఇప్పటివరకూ నిత్యసేవలు మాత్రం ప్రతీ దేవాలయంలో యధావిధిగా కోనసాగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయాన్ని కూడా కరోనా వైరస్ యొక్క నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మార్చి 20 నుంచి తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు.
ప్రస్తుతం లాక్డౌన్ గడువు సమీపిస్తుండటం మరియు కరోనా కేసులు తక్కువగా ఉన్న ప్రదేశంలో లాక్ డౌన్ నుండి సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో తిరుమలలో కూడా శ్రీవారి భక్తులకు కూడా సామజిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకునే వెసులుబాటు ఇచ్చే అంశంపై టీటీడీ సభ్యులు కసరత్తు మొదలు పెట్టారు
ఈ నేపథ్యంలో అక్కడ తొక్కిసలాట లేకుండా తిరుమలలో దర్శనం అమలును ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి తిరుమల, తిరుపతి ప్రాంత వాసులను మాత్రమే ఆలయంలోకి అనుమతించి భౌతిక దూరం పాటించే విధంగా క్యూ లైన్లో తోపులాట లేకుండా శ్రీవారి దర్శనం చేసుకునే పద్దతిని అమలు అంశాలను అధికారులు ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. ఇక క్యూ కాంప్లెక్స్ లను సైతం మూసివేసి స్వామివారి దర్శనం అయిన వెంటనే తిరిగి తిరుమల నుంచి కొండ క్రిందకు వెళ్లిపోయేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు.
ఈ విధంగా ఆలయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వ్యక్తిగత దూరం పాటిస్తూ భక్తులు శ్రీవారిని దర్శించుకునే విధంగా రోజుకు ఎంత మంది భక్తులను అనుమతించాలానే అంశంపై నిర్దారణకు వచ్చేందుకు పలు అంశాలను పరిశీలిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా టికెట్ తీసుకున్న భక్తులు ఇచ్చిన సమయానికి నేరుగా తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుని అక్కడినుండి వెనుదిరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే కరోనా నేపద్యంలో ఇకపై టీటీడీ వసతి గృహాలను మూసివేయనున్నారు.