హైదరాబాద్: ఓ పక్క కరోనా కబళిస్తోంది రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వేల మంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్ విధించింది భారతదేశం. ప్రజలంతా ఇప్పటికే ఇళ్ళకే పరిమితమయ్యారు.
అయితే కొందరు మాత్రం ఈ లాక్ డౌన్ ను అపహాస్యం చేస్తూ ప్రజల ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. పలువురు ఏమాత్రం కరోనా ఎఫెక్ట్ లెక్కచేయకుండా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి హలీం విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసారు పోలీసులు.
హైదరాబాద్ నగరంలో గల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 10, జహీరానగర్ చౌరస్తాలో రోడ్డుపైన హలీం అమ్ముతున్నారనే ఈ సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.దేశ వ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనల ప్రకారం ప్రజలుఒక చోట గుమికూడే పనులు చేయకూడదని అలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఎవరైనా హలీం మరియు ఇళ్లవద్ద తిరుగుతూ బట్టలు అమ్మడం, వండిన పదార్థాలు అమ్మడం లాంటివి చేస్తే వారిపై చట్టపరంగా కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇంటి వద్దనే హలీం తయారు చేసుకోవాలని పండగని ఇంట్లోనే కుటుంబసభ్యులతో చేసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఇలా మరెవరైనా చేస్తే లాక్ డౌన్ ఉల్లంఘన క్రింద శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరించారు.