కరోనా తో దేశ ప్రజలు పోరాడుతున్నారు. ఏపీలో కేసులు భారీగానే ఉన్నాయ్ కానీ ఇవేం ఏపి రాజకీయాలకు పట్టడం లేదు ఒక పక్క సోషల్ మీడియాలో విజయసాయి రెడ్డి చురకలు మరోపక్క ఎన్నికల అధికారిని తొలగించడం దీనిపై తెదేపా అభ్యర్థులు మండిపడటం ఇలా ఏపీ పాలిటిక్స్ హాట్ హాట్ గా సాగుతూనే ఉన్నాయి.
తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల కమిషనర్ ను తప్పిస్తూ వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై మండిపడ్డారు. కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రజల ప్రాణాలపై దృష్టి పెట్టాలే తప్ప మొండి వైఖరిని అవలంభిస్తూ కక్ష రాజకీయాలు చేయకూడదన్నారు.
ఏపీలో అన్ని ఊహాతీతంగా నడుస్తున్నాయి దీనికి ఉదాహరణే ఎస్ఈసీని తొలగిస్తూ జగన్ తీసుకున్న నిర్ణయం.. ఇక దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వం మరోసారి కక్షసాధింపు వైఖరితో వ్యవహరించిందని అన్నారు. ఎస్ఈసీని తొలగిస్తూ జగన్ తీసుకున్న నిర్ణయంతో తన వైఖరిలో మార్పు లేదని సీఎం నిరూపించుకున్నారని అన్నారు పవన్.
కీలక విషయాల్లో జగన్ నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉంటున్నాయని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషనర్ను తొలగించడానికి ఇది సమయమా అని పవన్ ప్రశ్నించారు.
ప్రజల ప్రాణాలపై వాళ్ళను కాపాడటం పై దృష్టి పెట్టాల్సిన గవర్నమెంట్… కక్ష సాధింపు పనిలో లీనమైపోయిందని విమర్శించారు. కరోనా సమయాన ఎన్నికలు నిర్వహించి ఉంటే ప్రజల ప్రాణాలు పరిస్థితి ఏమై ఉండేదని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడే సమయం ఇదని.. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని జనసేన కోరుకుంటున్నట్లు ఓ ప్రకటన ద్వారా వైసీపీ ప్రభుత్వానికి తెలిపారు పవన్ కళ్యాణ్.