ఆ మువ్వన్నెల పతాకం మలిచావు.. శాంతి, సమానత, సౌర్యం ఇలా ఎన్నో భావాలను అందులో ఇనుమడింపజేశావు.. భారతావనికి జాతీయ జెండా రూపశిల్పిగా మారావు.. స్వతంత్ర భారత సమర స్ఫూర్తికి పర్యాయపదంగా మారిన త్రివర్ణ పతాక సృష్టికర్త పింగళి వెంకయ్య. ఆ నిరాడంబర మహనీయుడు మన తెలుగువాడు కావడం మనకెంతో గర్వకారణం.
కృష్ణా జిల్లాలోని భట్లపెనుమర్రు గ్రామంలో 1878, ఆగస్టు రెండో తేదీన హనుమంతరాయుడు, వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించారు పింగళి వెంకయ్య. ఉన్నత పాఠశాల విద్య పూర్తి కాగానే ఆయన సీనియర్ కేంబ్రిడ్జ్ చేయడానికి కొలంబో వెళ్లారు. ధైర్య సాహసాలు మెండుగా ఉన్న పింగళి ముంబయికి వెళ్లి 19వ ఏటనే సైన్యంలో చేరారు. దక్షిణాఫ్రికాలో జరిగిన బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. లాహోర్లోని డీఏవీ కాలేజీలో చేరి ఆంగ్లో వేద పాఠశాలలో సంస్కృత, ఉర్దూ, జపనీస్ వంటి పలు భాషలు అభ్యసించారు. ఆయన భావజాలవేత్త, భాషావేత్త, భూవిజ్ఞాన శాస్త్రవేత్త, పింగళి వెంకయ్య రచయితగా బహుముఖ ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించడంలో దిట్ట. 1913లో జపనీస్ భాషలో అనర్గళంగా మాట్లాడి పలువురి ప్రశంసలు ఆదుకున్నారు. అందుకే ఆయనకు జపాన్ వెంకయ్య, వజ్రాల వెంకయ్య, పత్తి వెంకయ్య అనే పేర్లతో పిలిచేవారు.
స్వాతంత్ర్య పోరాట సమయంలో పోరాట యోధులు పలు జండాలు వినియోగించేవారు. అప్పట్లో కొంతమంది విడివిడి గ్రూపులుగా కూడా స్వాతంత్రంలో పాల్గొనటం ఒక్కక్క గ్రూపు ఒక్కోవిధమైన జండా ఉండటం చూసి 1918-1921 మధ్య కాలంలో జరిగిన కాంగ్రెస్ సెషన్స్ లో పింగళి వెంకయ్య పాల్గొని భారతీయులకు సొంత జెండా ఉండాల్సిన అవసరాన్ని అక్కడ ప్రస్తావించారు. అప్పటికి ఆయన మచిలీపట్నంలోని ఆంధ్ర నేషనల్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. మరోసారి విజయవాడలో గాంధీని కలిసినప్పుడు తాను రూపొందించిన జాతీయ జెండాను అనేక డిజైన్లలో చూపించారు. అప్పటివరకూ స్వాతంత్య్ర పోరాట సమయంలో ఎన్నో జాతీయ పతాకాలు వినియోగించారు.
స్వాతంత్ర్యలో పాల్గొనే ప్రతీ ఒక్కరూ ఈ జెండా తోనే ఒక్క తాటిపై ఉద్యమం కొనసాగించాలనే ఉద్దేశంతో మూడు రంగుల ముఖ్య ఉద్దేశాన్ని జండాలో ఉట్టిపడేటట్లు రూపొందించడంతో పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తించారు. అయితే 1921 మార్చి 31, ఏప్రిల్ 1 న విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో జాతీయ జెండాను ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఈ పతాకానికి కొద్దిగా మార్పులు చేర్పులూ చేశారు.
అయితే 1921 విజయవాడలోని నిర్వహించిన ఒక మహాసభలో మహాత్మగాంధీ దీనిని ఆమోదించారు. జాతీయజెండా తొలిసారి మన విజయవాడలోనే రెపరెపలాడింది. 1963 జులై 4న దివంగతులైన పింగళి వెంకయ్య గారు స్వాతంత్య్ర ఉద్యమంలో చేసిన పోరాటాల కంటే ఆయన జాతీయ జెండా సృష్టికర్త గానే మొత్తం జాతి ఏటా గర్వంగా ఆయన్ను గుర్తు చేసుకుంటోంది. అయన తన మొత్తం జీవితాన్ని దేశస్వాతంత్రం కోసం పాటుపడ్డారు.