కరోనా సమయంలో ఏది తినాలన్నా ఏది కొనాలన్నా భయం..భయం. ఏ చోటున కరోనా ఉందో అన్నట్టు నేడు బయటి పదార్ధాలు తినలేని పరిస్థితి ఏర్పడింది తాజాగా ఇలాంటి సంఘటనే జరిగింది కొల్లూరులో మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కొల్లూరు గ్రామానికి చెందిన ఒక ప్రజా ప్రతినిధి భర్త లాక్డౌన్ కష్టాలను కళ్లారా చూసి తనవంతు సాయంగా వూరిలో ఉన్న అందరికీ ఏదొక సాయం చేద్దామనుకుని పూనుకున్నాడు.
అయితే తన ఆలోచనకి కొద్దిగా డబ్బు స్నేహితులనుండి విరాళంగా రావడంతో నేడు కూరల ధరలు మాడిపోతుండటంతో పచ్చడిపట్టి అది పంచితే కనీసం వేడివేడి అన్నంలో కొద్దిగా పచ్చడికలుపుకుని తినైనా కరోనా కాలం నుండి గట్టేక్కుతారని భావించిన అతడు మామిడి తొక్కు పచ్చడి పెట్టి అది ఊరంతా పంచాలని నిర్ణయించుకున్నాడు.
తానూ అనుకున్నదే తడవుగా షాద్నగర్కి చెందిన తనబంధువుల వ్యాపారిని మే నెల18న కలిసాడు. తన ఆలోచనగురించి అతనితో చెప్పి ఊరందరికీ పచ్చడి పంపిణీ చేసేలా ఒప్పందం చేసుకున్న లెక్క కూడా చెప్పాడు. ఇక తన ఆలోచనని గురించి గ్రామసభ పెట్టి మరీ ప్రజా ప్రతినిధుల సమక్షంలో గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు ప్రజాప్రతినిధి భర్త.
ఇక పచ్చడిపని నిమిత్తం మే 20న షాద్నగర్ నుండి మామిడి తొక్కు పచ్చడి తయారీ చేసేందుకు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గ్రామానికి తీసుకొచ్చాడు వాళ్ళు రోజంతా అక్కడే ఉండి 2 క్వింటాళ్ల మామిడి తొక్కు పెట్టారు. అక్కడ చాలా మంది దాన్ని రుచి కూడా చూశారు.
పైగా వాళ్ళ తోనే ఉప్మా వండించుకొని తిన్నారు కూడా . పచ్చడి పట్టేసి వాళ్లు వెళ్లిన తర్వాత తొక్కును ప్యాక్చేసి ఊరంతా పంచాలనుకున్నారు. కానీ అదే రోజు షాద్నగర్ వ్యాపారికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది.
ఇక ఈ అనుమానంతో యజమాని పురమాయించి తొక్కు పెట్టిన ఇద్దరి వ్యక్తులకూ పరీక్షలు చెయ్యగా మరుసటి రోజు వారికి కూడా పాజిటివ్ అని తేలింది. ఈ విషయం తెలిసిన ప్రజా ప్రతినిధి భర్తతో పాటు ఊర్లోని జనం అందరికీ భయం మొదలైంది. చేసేదేమీ లేక లబోదిబోమంటున్నారు తొక్క పెట్టిన వాళ్లకు కరోనా రావడంతో గ్రామస్తులు ఆ తొక్కను డంప్ యార్డులో పడేశారు.
దీంతో ఊరు ఊరంతా ఒక్కసారిగా వణికిపోతోంది. వెంటనే ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇచ్చారు. వూరు ఊరంతా భయపడి చస్తున్నం బాబు.. టెస్టులు చేయండంటూ మొత్తుకుంటోంది. ఈ విషయంపై అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ ఇద్దరితో పాటు అక్కడ ఎక్కువగా కాంటాక్టయిన మిగతా 12 మందికైనా కరోనా పరీక్షలు చేయండంటూ వూరి జనం మొర పెట్టుకుంటున్నారు.
సుమారు 4 వేలకు పైగా జనం ఉన్న ఆ గ్రామంలో ఇప్పుడు సుమారు 100 మందికి పైగా కరోనా దెబ్బకి హోమ్ క్వారంటైన్లోకి వెళ్ళిపోయారు. అయితే ఈ వూరిలో ఎవరికి వైరస్ సోకిందో తెలియక వూరి ప్రజలు మానసికంగా నరకం చూస్తున్నామని, ఇప్పటికైనా కరోనా టెస్టులు చేయాలని కోరుతున్నారు ఆ గ్రామస్తులు. టెస్ట్ చేయకుంటే ఊరంతా వల్లకాడుగా మారుతోందంటున్నారు.