ప్రస్తుతం దేశంలో ఎక్కడికక్కడే అన్నీ నిలిచిపోయాయి. లాక్డౌన్ వల్ల నేతన్నకు పూట గడవడమే కష్టంగా మారిందని ఆవేదన చెందారు.. రాష్ట్రంలో చేనేత వృత్తిపై 2.5 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని పవన్ చెప్పారు. ప్రస్తుతం పనిలేక అల్లాడుతున్న చేనేత సోదరులను వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు.
చేనేతకు సంబంధించి ఉత్తరాంధ్ర, కోస్తా,రాయలసీమలో ఈ వృత్తిపై ఆధారపడ్డ కుటుంబాలు లక్షల్లో ఉన్నాయన్నారు. పనిలేక పూటగడవక ఇబ్బంది పడుతున్న చేనేత కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని పవన్ అన్నారు. లాక్డౌన్ వల్ల అన్నీ నిలిచిపోవడంవల్ల నేతన్నకు పూట గడవడమే కష్టంగా మారిందని ఆవేదన చెందారు పవన్ కళ్యాణ్.
లాక్డౌన్ తర్వాతకూడా వాళ్ళకి పనిదొరికే దారిలేదని అందుకే లాక్ డౌన్ తర్వాతకూడా చేనేత కార్మికుల జీవనోపాధికి అవసరమైన మార్గాలను ప్రభుత్వమే చూపించాలని అన్నారు. గత ఏడాది తెచ్చిన నేతన్న నేస్తం పథకంతో కేవలం 83 వేల మందికే ఆర్థిక సాయం అందిందని తెలిపారు. ప్రభుత్వం తక్షణ సాయంగా ప్రతి కుటుంబానికి రూ.10 వేలు సాయం అందించాలన్నారు నేతన్న నేస్తం పథకాన్ని కొందరికి మాత్రమే పరిమితం చేయకూడదని కోరారు. ఈ వృత్తిపై ఆధారపడ్డవారందరికీ పథకాలు అమలు చేయాలని సూచించారు. చేనేత కార్మికులు ఎవ్వరు ఆకలితో ఉండకూడదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.