కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై అధికారులు మరింత అలర్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లాల కలెక్టర్స్ తో విజయవాడ ఆర్ అండ్ బి కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎస్ నీలం సాహ్ని. వైరస్ ప్రభావంతో క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్న బాధితులకు మంచి ఆహారం, పండ్లు ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఇక ప్రభుత్వం ఆదేశం మేరకు క్వారంటైన్ పూర్తై ఇళ్లకు వెళ్లే వారికి రూ. 2 వేల రూపాయలు ఇవ్వాలని తెలిపారు. కరోనా పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని దాని నియంత్రణకై ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు. ఈ కరోనా మహమ్మారిని అరికట్టాలంటే స్వీయ నిర్బంధం, హోమ్ ఐసోలేషన్, క్వారంటైన్ ఒక్కటే మార్గమని సీఎస్ అన్నారు.
కరోనా అనుమానంతో ఎక్కడ శాంపిల్స్ తీసుకున్నారో ఆ వివరాలు ప్రజలకు తెలియజేయాలని కలెక్టర్స్ కి ఆదేశించారు. కరోనా వైద్యం కోసం కొన్ని చోట్ల ఆస్పత్రులను కోవిడ్ హాస్పిటల్స్ గా ప్రకటించడంతో సాధారణ వైద్య సేవలకు ఆటంకం కలిగింది.
కాబట్టి ఆ సేవలందిస్తున్న ఆసుపత్రులపై ప్రజలందరికీ పూర్తి అవగాహన, సమాచారం అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి చెప్పారు. ఇక ప్రతిఒక్కరి ఫోన్స్ లో ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేయించాలన్నారు. ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెడ్ క్రాస్ కేంద్రాల్లో రక్తదాన సేకరణకు అనుమతులిచ్చామని జవహర్ రెడ్డి కలెక్టర్లకు తెలిపారు