కరోనా.. నేడు ఈ పేరు ప్రపంచ దేశాలన్నీ కుదేలైయ్యేలా చేసింది. ప్రజలను మానసికంగా భయభ్రాంతులను చేసి కంటిమీద కునుకు లేకుండా ప్రజలను వెంటాడుతోంది. మానవజాతి మనుగడను, స్వేచ్ఛనూ కబళించిన మహమ్మారి ఈ వైరస్. ఎన్ని లాక్ డౌన్ లు పెట్టినా, అన్నీ ముసేసినా కరోనా కేసుల సంఖ్య మాత్రంతగ్గకపోగా ఇంకా పెరుగుతూనే ఉండటం ఇప్పుడు ప్రజలు అందరినీ మరింత కలవరపెడుతోంది.
కరోనా తన తీవ్రతతో మానవజాతి మొత్తాన్ని అతలాకుతలం చేస్తుంది. ఈ కరోనా వైరస్ ను అంతం చేసే వ్యాక్సిన్ కోసం ఇప్పటికీ ప్రపంచ దేశాలన్నీ ఎంతగానో ఎదురుచూస్తున్నాయి. నేడు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పలు దేశాల్లోని పలువురు శాస్త్రవేత్తలు కరోనాకు వ్యాక్సిన్ను కనుగొనడంలోఒకరకంగా సఫలీకృతం అవుతున్నారనే చెప్పాలి. అయితే ప్రస్తుతం మొత్తం ప్రపంచం చూపు లండన్ ఆక్సఫర్డ్ యూనివర్సిటీ పైనే ఉంది.
అస్ట్రాజెనెకా అనే మందుల తయారీ కంపెనీతో ఆక్సఫర్డ్ యూనివర్సిటీ కలిసి రూపొందిస్తున్న ChAdOx1 nCoV-19 అనే నామం గల కరోనా వ్యాక్సిన్ కోతులపై ప్రయోగించగా ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టింది. ఈ వ్యాక్సిన్ పరిశోధనలో ఒకరైన అడ్రియాన్ హిల్ అనే సీనియర్ శాస్త్రవేత్త కరోనా వ్యాక్సిన్ ధర మరియు వ్యాక్సిన్ గురించిన అనేక విషయాలను మీడియా ద్వారా తెలిపారు.
ఈ మహమ్మారిని అరికట్టే కరోనా వ్యాక్సిన్ అతి తక్కువ ధరకు లభిస్తుందని ఆయన తెలిపారు. వీలైనంత తక్కువ ధరలోనే ఎక్కువ మందికి అందజేయడమే తమ లక్ష్యమని తెలిపారు. తాము ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరికీ ఈ వ్యాక్సిన్ వారికి చేరేలా అనేక దేశాల్లోని సుమారు ఏడు ఇనిస్టిట్యూట్లలో ఈ కరోనా వ్యాక్సిన్ తయారు చేసేందుకు అనేక ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
ఇక ఈయన చెప్పిన వాటి జాబితాలో భారత్లోని పూణే సీరమ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ కూడా దీనిలో ఉందని ఆయన తెలిపారు. ఇక ఈ వ్యాక్సిన్ జూలై, ఆగస్టు నాటికల్లా మనుషులపై ట్రయిల్స్ చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ వాక్సిన్ బయటికి వస్తే ఇక ప్రపంచం మొత్తం మునుపటి సాధారణ స్థితిలోకి వెళ్తుందని పేర్కొన్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఆక్సఫర్డ్ తయారు చేసిన ChAdOx1 nCoV-19 అనే వ్యాక్సిన్ ఫెయిల్ అయ్యిందని సోషల్ మీడియాలో అనేక పుకార్లు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి.